హైదరాబాద్ : సహకారశాఖ ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గృహకల్పలో బుధవారం తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార శాఖ ఉద్యోగులకు నిరంతర శిక్షణలు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలన్నారు. సాగునీటి రాకతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో సహకార శాఖ ప్రాధాన్యం పెరిగిందన్న ఆయన.. నీటి వృథాను అరికట్టడం, సాగు చేయాల్సిన పంటల రకాల మీద రైతులను చైతన్యం చేసే బాధ్యత సహకార శాఖ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరంగంలో మనుషుల మధ్య సంబంధాలను పెంచేందుకు కృషిచేయాలని, సహకార సంఘాలు బలోపేతం కాకుంటే కార్పోరేట్ వ్యవస్థ వేళ్లూనుకుంటుందని హెచ్చరించారు. దాంతో సమాజానికి నష్టం చేకూరుతుందన్నారు.
గతంలో సహకార సంఘాల్లో ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులుండేవని, తెలంగాణ ఏర్పాటు తర్వాత సహకార సంఘాలు బలోపేతమయ్యాయన్నారు. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకార ఉద్యోగులు కేరళలోని సహకార సంఘాలను అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.