వనపర్తి : తెలంగాణ సాధించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు అనేక కేసులతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతి బంధకాలు సృష్టించారని తెలిపారు. అయినప్పటికీ అవరోధాలను అధిగమించి పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డి పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. ప్రస్తుతం దాదాపు 12 లక్షల ఎకరాలు సాగవుతున్నదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో నిన్నటి సభతో తేలిపోయిందన్నారు. విపక్ష నేతలు కొందరు కారుకూతలు కూస్తూ మొరుగుతున్నారు. కొందరు కిరాయి సైన్యాలతో ప్రజలు తమ వైపే ఉన్నారని భ్రమపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో వారి పరిస్థితి గుండు సున్నా అని విమర్శించారు.
జిల్లాలో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం అసాధారణ విషయమన్నారు. రూ. కోటి, కోటిన్నర, రూ.3 కోట్ల నుండి ఏకంగా రూ.15 కోట్లు ఇవ్వడం సంతోషదాయకమననారు. డబల్ బెడ్రూం ఇండ్లు కూడా జిల్లాకు అదనంగా ఇస్తామని కేసీఆర్ చెప్పారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా జిల్లాకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.