హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడేవాళ్లమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలన్నారు. దేశ పౌరుడిగా, సగటు మనిషిగా సమస్యలపై స్పందించాలన్నారు. ఎర్రకోట సాక్షిగా రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నం. కానీ అది సక్రమంగా అమలు కావడంలేదు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామన్నారు.
మెరిట్ లేకుండా ఏ సీటు రాదు. అలాగే మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలన్నారు. రాజ్యాంగాన్ని అర్దం చేసుకోగలగడమే ఆ మెరిట్ అన్నారు. సంపద కేంద్రీకరించడం పేదరికానికి కారణం అన్నారు. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదన్నారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒకనాడు నీ గడప కూడా తొక్కుతుందన్నారు. ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాల్సిన అవసరం ఉందన్నారు.