హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. దీంతో గత డిసెంబర్ 28 నుంచి ఇప్పటివరకు మొత్తం 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,754.64 కోట్లు జమ చేశామని వివరించారు.
ప్రతి రైతుకు రైతుబంధు సాయం అందజేస్తామని, పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తిచేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కరోనా కాలంలో ఇబ్బందులు ఉన్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వంద శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ప్రతిసారీ రైతుబంధు నిధుల విడుదలకు ముందు, ధాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం మీద బురదజల్లడం విపక్షాలు, ఒక సెక్షన్ మీడియా లక్ష్యంగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు.