హైదరాబాద్ : రాజేంద్రనగర్లో అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విత్తన ల్యాబ్ను నిర్మించారు. ఇటీవలే ఈ ల్యాబ్కు స్విట్జర్లాండ్ వేదికగా కొనసాగే అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేం ద్రంగా తెలంగాణ ల్యాబ్ నిలిచింది. ఈ ల్యాబ్ దేశంలోనే అతిపెద్దది.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని చెప్పారు. వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ఏవో వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామన్నారు. విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తన రంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.