వనపర్తి: వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Nirajan Reddy) నామినేషన్ దాఖలు చేశారు. వనపర్తిలోని (Wanaparthy) తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్వో కార్యాలయానికి ఎడ్లబండిపై బయల్దేరారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసందోహం నడుమ ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
నిరంజన్ రెడ్డి.. 1999-2000 ఏపీ ఖాదీ బోర్డు చైర్మన్ పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2014లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2018 డిసెంబర్లో వనపర్తి అసెంబ్లీ నుంచి చిన్నారెడ్డిపై 51,685 ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. ఫిబ్రవరి 2019లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్కెటింగ్, కో-ఆపరేషన్, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.