మహబూబ్నగర్ : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ చంద్రశేఖర్రావు నమ్ముతున్నారని, ఈ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా మహమాదాబాద్ మండలం చౌదర్పల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు.
పథకం కింద ఇప్పటి వరకు ఏడు విడుతల్లో నిధులు జమ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఎనిమిదో విడుత జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.50,600కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోనే రూ.14,000కోట్లు పెట్టుబడి సాయంగా రైతులకు అందించినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో రైతుబంధు అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ సొంత వనరులతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పటి వరకు పీఆర్ఎల్ఐ కింద రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యిందని, కొన్ని చోట్ల మాత్రం కాలువల నిర్మాణం మిగిలి ఉందన్నారు. కోర్టుల కేసులతో ఆలస్యమవుతుందని, ఈ విషయాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు, ప్రజలు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.