హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్అలీ రాష్ట్ర పోలీస్శాఖను ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై నిఘా మరింత పెంచాలన్నారు. గురువారం లక్డీకపూల్లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
డీజీపీ ఎం మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, మూడు కమిషనరేట్ల సీపీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. పబ్లు, బార్ల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశాలకు సంబంధించి పోలీసులు, ఎక్సైజ్శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు. మహిళల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేలా విద్యాసంస్థలు, పాఠశాలలు, తదితర ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమీక్షలో సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్భగవత్ తదితరులు పాల్గొన్నారు.