హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): గౌడ కులస్థులంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారనే అక్కసుతో హైదరాబాద్ కల్లు సొసైటీలపై కొన్ని జాతీయ పార్టీలు కుట్రతో దాడులు చేయించాయని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. హైదరాబాద్లోని కల్లు సొసైటీలను కాపాడాలని కోరుతూ మంత్రికి ప్రగతిభవన్లో శనివారం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని 69 కల్లు సొసైటీలపై ఇటీవల జరిగిన నారోటిక్ అధికారుల దాడుల గురించి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్లుగా గౌడ సామాజికవర్గాన్ని కడుపులో పెట్టుకొని చూశామని చెప్పారు. దాడులతో గౌడ సామాజికవర్గాన్ని భయపెట్టిస్తున్నారనే అనుమానం ఉన్నదని తెలిపారు. గౌడల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు సొసైటీలను మూసివేస్తే వాటిని తెరిపించిన ఘనత తమదేనని తెలిపారు. రూ.20 కోట్ల రెంటల్స్ రద్దు చేశామని, హరితహారంలో భాగంగా 4 కోట్ల ఈత, తాటి మొకలను నాటించామని వివరించారు.
నగరంలో నీరా కేఫ్ ఏర్పాటుతో గౌడ సోదరుల గౌరవం పెంచామని, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని, గౌడ ఆత్మగౌరవ భవనం వంటి ఎన్నో పనులు చేశామని వివరించారు. గౌడలను భయభ్రాంతులతో బీఆర్ఎస్కు దూరం చేయాలని కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఈ సందర్భంగా పల్లె లక్ష్మణ్రావుగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.