హైదరాబాద్: ఖమ్మం జిల్లా చీమలపాడు (Cheemalapadu) అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన (Gas cylinder blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
ఏప్రిల్ 12న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ది గ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కి, చీమలపాడులో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్రావుకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కు టుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, అం డగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతోపాటు నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించా రు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తానని ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీమలపాడుశివారులో బుధవారం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అప్పటికే ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు ఇతర నాయకులు సభాస్థలికి చేరుకున్నారు. నిర్వాహకులు ఒక్కో ప్రజాప్రతినిధిని వేదిక మీదికి ఆహ్వానిస్తుండగా ప్రాంగణానికి సమీపంలోని ఓ పూరి గుడిసెలో పేలు డు శబ్దం వచ్చింది. పటాకులు గుడిసెలో పడటంతో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులు హాహాకారాలు చేశారు.
ఈ ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆజ్మీరా మంగు (38), నరాటి వెంకన్న, స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేశ్ (37), తవిసిబోడుకు చెందిన తేజావత్ భాస్కర్, వెంకిట్యాతండాకు చెందిన ఆంగోత్ కుమార్, గేట్ రేలకాయలపల్లికి చెందిన ధరంసోత్ లక్ష్మణ్(53), హెడ్ కానిస్టేబుల్ నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ కారేపల్లికి చెందిన తేళ్ల శ్రీనివాసరావు, ఇల్లెందు పట్టణానికి చెందిన బండి రా మారావుకు స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే రా ములునాయక్, ఎంపీ నామా, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అప్రమత్తమై కార్యకర్తలు, స్థానికుల సాయంతో క్షతగాత్రులను నాలుగు పోలీస్ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆజ్మీరా మంగు, బానోత్ రమేశ్, ధరంసోత్ లక్ష్మణ్ మృతిచెందారు.