Telangana Cabinet | తెలంగాణలోని అనాథ పిల్లలకు ఇక తల్లీతండ్రి ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. వారిని చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అనాథ పిల్లల ఆలన, పాలన ప్రభుత్వానిదే..! ఆర్ఫన్ పాలసీ తెచ్చేందుకు శిశు సంక్షేమశాఖకు కేబినెట్ ఆదేశం ఇచ్చింది. తెలంగాణ కేబినెట్ ఉదాత్తమైన, మానవీయకోణంలో మరో నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని ఎక్కడా లేనివిధంగా అనాథ పిల్లల సంరక్షణ, ఆలన, పాలన.. ప్రభుత్వం తీసుకోబోతున్నది.
చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్గా గుర్తిస్తూ ఆర్ఫన్ పాలసీని పకడ్బందీగా రూపొందించాలని శిశు సంక్షేమశాఖ మంత్రి, అధికారులకు సీఎం కేసీఆర్, కేబినెట్ సూచించింది. ఇప్పటికే మానవీయ కోణంలో అద్భుతమైన కార్యక్రమాలు పేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం.. అనాథ పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వమే వారికి తల్లిదండ్రిగా ఉండి.. వారికి ఆశ్రయం కల్పించి.. ప్రయోజకులుగా ఎదిగి.. వారికంటూ ఒక కుటుంబం ఉండే వరకు అండగా నిలబడాలని ఉదాత్తమైన ఆశయంతో సమగ్రమైన చర్చ జరిగింది. మంత్రివర్గ ఉప సంఘం ఈ విషయంలో ఇప్పటికే పని చేస్తుంది. తర్వాత జరిగే కేబినెట్ సమావేశం వరకు పాలసీని తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే కేబినెట్లో పాలసీని ఆమోదిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.