హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గట్టుప్పల్ ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎందుకంటే ఈ గట్టునేమో మంచినీళ్లు ఇచ్చిన కేసీఆర్ పార్టీ ఉంది. మరి ఆ గట్టునేమో మనల్ని కన్నీళ్లు పెట్టిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నది. ఈ గట్టునేమో రైతుబంధు లాంటి కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టునేమో కృష్ణా జలాల్లో మన వాటా తేల్చకుండా సతాయిస్తున్న నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ గట్టునేమో రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టునేమో సిలిండర్ ధరను రూ. 1200 చేసిన మోదీ ఉన్నారు. మరి ఏ గట్టున ఉందాం.. ఎవర్నీ గెలిపించుకుందాం అని ఆలోచించాలి.
ముఖ్యంగా గట్టుప్పల్ నేతన్న ఆలోచించాలి. 5 శాతం జీఎస్టీ వేసి చేనేతకు మరణ శాసనం రాస్తున్న మోదీ ఒక వైపు ఉంటే, చేనేత మిత్ర, నేతన్నకు బీమా, నేతన్నకు చేయూత లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ ఈ గట్టున ఉన్నారు. అందుకే ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద నుంచే గట్టుప్పల్ అనే పేరు వచ్చింది. ఆ స్వామి వారి సాక్షిగా ఆలోచించండి. ఎవరు మనకు మిత్రులు. కార్పొరేట్ కమలమా..? గరీబోళ్ల గులాబీనా..? ఎవరు గెలిస్తే గట్టుప్పల్, మునుగోడు బాగయితది. మన గోడు ఎవరు వింటారనేది ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ సూచించారు.