కేటీఆర్కు ఘన స్వాగతం
స్విట్జర్లాండ్ దావోస్లో ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న మంత్రి కే తారకరామారావుకు విమానాశ్రయంలో ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ నగరం నుంచే కాకుండా స్విట్జర్లాండ్లోని ఇతర నగరాలు, యూరప్లోని ఇతర దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ గంధె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా పేదలకు ఉచితాలు అనుచితమంటూ మాట్లాడితే అది కచ్చితంగా తప్పేనని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రోజు పేదలకు ప్రపంచ రాజధానిగా ఉన్నదని, ఈ విషయాన్ని మరిచి, పేదల సంక్షేమం పట్ల అవగాహన లేకుండా అవహేళనతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ వచ్చిన కేటీఆర్ సోమవారం జ్యూరిచ్ నగరంలో ఎన్నారైల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి వందలాది మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కేంద్రం తెచ్చిన అప్పుతో ఏం చేశారు?
ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, 24 గంటల విద్యుత్తు ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో కట్టడం చిన్న విషయాలైతే మరి గతంలో తమ కన్నా ముందు పాలించిన పార్టీలు ఎందుకు చేయలేకపోయాయో ప్రజలకు చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవిష్యత్తుకు మార్గం వేసే భారీ ప్రాజెక్టులపై నిధులు ఖర్చు పెడితే దాన్ని అప్పు, తప్పు అంటూ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ప్రజలకు తాగు నీళ్లు ఇచ్చేందుకు, పంటలకు నీళ్లిచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్టులు కడితే తప్పా? పవర్ ప్లాంటులు, నీళ్ల ట్యాంకులు కడితే తప్పా? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే అది అప్పు అవుతుందా లేకా పెట్టుబడి అవుతుందా’ అని ప్రశ్నించారు. రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని మోదీ దేశానికి ఉపయోగపడేలా చేసిన పని ఒకటైన ఉన్నదా చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
వికాసం కోసమే విభజన
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తమతో సానుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వం సైతం అవార్డులను ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం తెలంగాణ నగరాలకు, తెలంగాణ కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన నాడే.. విభజన వికాసం కోసమే అని అన్నామని, రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని ఆకాంక్షించామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. స్వపరిపాలన కావాలి, స్వయంపాలన కావాలి అన్న నినాదంతో ఉద్యమం చేశామని, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.
అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించి, లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నారైలు తెలంగాణకు సద్భావన రాయబారులుగా ఉండాలని కోరారు. తాము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు తమ భాగస్వామ్యాన్ని అందించే వీలున్నదని, రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, అకడి పరిస్థితులను తమ స్థాయిల్లో ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నించాలని ఎన్నారైలను కోరారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఎవరు ముందుకొచ్చినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.
మానవ జీవితం పరిమితం
ప్రవాస భారతీయులతో మకర సంక్రాంతి జరుపుకొనే అవకాశం ఇచ్చినందుకు ప్రవాస భారతీయులందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా ప్రవాస భారతీయుడినేనని, కొంతకాలం విదేశంలో పనిచేసి భారత్కు వెళ్లానని తెలిపారు. దేశంలో ఉన్న వాళ్లతో పోల్చితే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానిక అంశాలు, అభివృద్ధి పట్ల మకువ ఎకువగా ఉంటుందని అన్నారు. స్విట్జర్లాండ్ వచ్చిన ప్రతిసారి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు అభినందనీయమని ప్రశంసించారు. మానవ జీవితం పరిమిత కాలమనే ఫిలాసఫీని నమ్మి, సాధ్యమైనంత ఎకువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలు తెలుగు ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి
స్వతంత్ర భారతదేశంలో గ్రామ జీవితాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదంటే అతిశయోశక్తి కాదని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించిందని చెప్పారు. ఒక వైపు ఐటీ, పరిశ్రమల ఉత్పత్తులు, మరోవైపు వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగాయని తెలిపారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సంకల్పాన్ని చేపట్టి, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి.. భారతదేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శ నమూనాగా మార్చిన ఘనత సీఎం కేసిఆర్దే అని చెప్పారు.