KTR | కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డేలో పాల్గొన్నారు. సభలో ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు కేటీఆర్. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో లాగే ఛత్తీస్గఢ్లో వరి, పత్తి సాగవుతుంది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాళ్లు కొంటుందో తెలుసా? రైతులు ఎన్ని క్వింటాళ్లు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేసేది 12 క్వింటాళ్లే. మిగతా ధాన్యమంతా మార్కెట్కు వెళ్లి మిల్లర్ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందే తప్ప.. ప్రభుత్వ రక్షణ లేదు. ప్రభుత్వ మద్దతు ధర లేదు.
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఉంటే.. ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతరు. ఇక్కడ ఇంకా కొనపాయె వడ్లు.. ఇంక ఎన్నడు కొంటరు? ఇంకేం చేస్తరి ఎగిరెగిరిపడుతరు. అక్కడ ఇచ్చేది ఎకరానికి రూ.2వేలు కూడా పంట పెట్టుబడికి ఇచ్చేది లేదు. ఇక్కడ తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న కేసీఆర్ అదే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నరు. అక్కడ మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు. ఇక్కడకు వచ్చి మాత్రం పెద్ద డైలాగ్లు, యాక్టింగ్లు, ఉపన్యాసాలు, ఊదరగొట్టే డైలాగులు, ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నరు. ఛత్తీస్గఢ్లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరి ఆదరిద్దాం.. ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది’ అని చెప్పారు.
‘ఇక్కడున్న గిరిజన, లంబాడాలు ఎన్నో ఏళ్ల నుంచి మా తండాల్లో మా రాజ్యం ఉండాలి, మా ఊళ్లో మా సర్పంచ్ ఉండాలని దశాబ్దాల నుంచి గొంతు చించుకున్నా పట్టించుకున్న నాయకుడు లేడు. కేసీఆర్ వచ్చాకనే ఈ రాష్ట్రంలో 3,146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలు అయిన మాట వాస్తవమే అయితే చప్పట్లతో హైదరాబాద్కు వినిపించేలా చెప్పాలి. ఎక్కడో హైదరాబాద్కు, అభివృద్ధికి దూరంగా విసిరేసినట్టు ఉన్న ములుగు ఒకనాడు.. తాలూక కేంద్రం కావాలంటే గగనం. గ్రామ పంచాయతి కూడా కాని ములుగు ఈ ఇవాళ మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రమైంది. ఇక్కడ శాసనసభ్యురాలు ప్రతిపక్షమైనా చూడకుండా ఇక్కడ ఉన్నది మనబిడ్డలేనని వివక్ష చూపొద్దని చెప్పి నలుగురు మంత్రులను సీఎం కేసీఆర్ ములుగుకు పంపారు. ఉంతగనే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోయేందుకు రాలేదు. ఏం చేశామో, చేయబోతున్నమో చెప్పేందుకు వచ్చాం. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత గ్రామ పంచాయతీ ఉంటే బాగుండదని చెప్పి మొన్న శాసనసభ సమావేశాల్లో ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేశాం. జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్పీలు కుసునేందుకు.. ప్రజలు వచ్చే సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి సౌలత్లు ఉండాలి. అందుకే రూ.65కోట్లతో కలెక్టర్ కార్యాలయానికి నేడు లాంచనంగా శంకుస్థాపన చేసుకున్నాం’ అన్నారు.
‘జిల్లా ఎస్పీ కార్యాలయానికి రూ.38.50కోట్లతో హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. రూ.12కోట్లతో ఐదు మోడల్ పోలీస్స్టేషన్లకు శంకుస్థాపన, ఓ మోడల్ స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బస్డిపో ఉండాలంటే రూ.10కోట్లతో శంకుస్థాపన చేశాం. రూ.4కోట్లతో సీసీరోడ్లు, మురికి కాలువలు, రూ.కోటితో వైకుంఠధామం, రూ.30లక్షల లైబ్రరి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ప్రజలపై ప్రేమతో, అభిమానంతో మంత్రులను ఇక్కడికి పంపారు. 116 మంది దళితులకు రూ.2.39కోట్లు, ఎస్టీలకు రూ.1.45కోట్ల బ్యాంకు ద్వారా సబ్సిడీ అందించనున్నాం. 3వేల మంది యాదవులకు రూ.1.87లక్షల సబ్సిడీతో గొర్రెల పంపిణీ ప్రారంభించుకున్నాం. 33 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు ఇవ్వబోతున్నాం. 37 కుటుంబాలకు ఇంటి పట్టాలు, నాలుగు ఫిషరీ సొసైటీలకు రిజిస్ట్రేషన్ పట్టాలు, 1181 మహిళా సంఘాలకు రూ.110కోట్ల విలువైన చెక్కులు, మూడు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లాలోనే 17వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు అందజేయనున్నాం’ అని కేటీఆర్ వివరించారు.