హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడి హేయమైన చర్య అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో బుధవారం తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్పొరేటర్లను శాంతియుతంగా నిరసన తెలిపాలని కోరడం గాడ్సే భక్తులను గాంధేయ మార్గంలో నడవమన్నట్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను కోరారు. బల్దియా కార్యాలయంలో గూండాగిరి చేసిన బీజేపీ కార్పొరేటర్లు, వారి అనుచరులపై నమోదైన కేసులో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా జీహెచ్ఎంసీ కార్యాలయం పరిసర ప్రాంతాలలోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించి 32 మందిని గుర్తించారు. మరింత మందిని గుర్తించే పనిలో ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. రాంనగర్, మూసారాంబాగ్, బేగంబజార్, ఆర్కేపురం, గన్ఫౌండ్రీ, మల్కాజిగిరి తదితర డివిజన్ల కార్పొరేటర్లు విధ్వంసకాండలో ప్రధాన భూమిక పోషించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.