హైదరాబాద్: ఫాక్స్కాన్కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పవర్హౌస్గా తెలంగాణను మార్చుతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫాక్స్కాన్ (Foxconn) టెక్నాలజీస్ ప్లాంట్కు కంపెనీ సీఈవో యాంగ్లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్కాన్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 2న ఫాక్స్కాన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని చెప్పారు. రెండు నెల్లలోనే అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను మంత్రి అభినందించారు. ఏడాదిలోగా ప్లాంటు పూర్తికావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫాక్స్కాన్ తెలంగాణకు ఐకాన్గా నిలువనుందని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్లో సంస్థతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 23 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. గతేడాది దేశంలో కల్పించిన ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలో ఇచ్చామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. మరో 10 ఏండ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఫాక్స్కాన్ సీఈవో యాంగ్లియూ అన్నారు. ప్లాంటు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.