సిరిసిల్ల: ఆశా వర్కర్లకు (ASHA workers) అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగణేనని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్లా (Sircilla) జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని వెల్లడించారు.
అంతకుముందు జిల్లెల్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్, సోలార్ప్లాంట్ను ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ను తిలకించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారు రూపొందించిన ప్రాజెక్టులను గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన షాదీఖానను ప్రారంభించారు.