‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని గోరటి వెంకన్న అన్నట్టుగా ఒకప్పుడు వలపోసుకొన్న గ్రామాలు, ఈ రోజు నవ చరిత్రకు పునాదులుగా మారాయి. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని అడిగితే.. 19 తెలంగాణలోనే ఉన్నాయనే స్థాయికి చేరాయి. పల్లె బాగుపడ్డది కాబట్టే తెలంగాణ బాగున్నది.
‘రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లెకందం గూర్చు ప్రతిభయేలేదా’ అని ప్రజాకవి కాళోజీ పల్లెల గురించి ఆవేదనతో రాశారు. ఇప్పుడు పల్లె మురిసిపోతున్నదని, పట్టణం మెరిసిపోతున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే చెప్తున్నాయి.
‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా.. నా తెలంగాణలోన’ అని అప్పట్లో పాటలు రాశారు. ఇప్పుడు అదే పాలమూరులో 11 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.
‘సేతానమేడుందిరా.. తెలంగాణ చేలన్నీ బీళ్లాయెరా’ అని గోరటి వెం కన్న పాటరాశారు. ఇప్పుడు ఆ పాట ను వింటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామని ఆశ్చర్యం అనిపిస్తున్నది.
‘పురుగుల మందే పెరుగన్నమైందా రైతన్నా?’ అని తెలంగాణ కవులు రాశారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో మూడో స్థానంలో నిలిచాం.
‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేను నీ చెలకా ఎడారి’ అని కరీంనగర్కు చెందిన సదాశివుడు రాశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసి గోదావరి నీళ్లను తెలంగాణ భూముల్లోకి పారించాం.