హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వార్డు అధికారితోపాటు మొత్తంగా వార్డులో 10 మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. దీంతో ప్రజా సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే సిటిజన్ చార్టర్ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉన్నదని, అందులో హైదరాబాద్లోనే కోటి మందికిపైగా ఉన్నారని తెలిపారు. నగరంలో జనసాంద్రత చాలా ఎక్కువని చెప్పారు. కోటి మందికి సేవలు అందించేందుకు క్షేత్రస్థాయికి పాలనను విస్తరించామన్నారు. అధికారులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వార్డు పరిపాలన తీసుకొచ్చాని వెల్లడించారు. గ్రామాలలో పంచాయతీ సెక్రెటరీ, ఇతర సిబ్బంది ఉంటారని, చిన్న చిన్న మున్సిపాలిటీలలో వార్డుకొక ఆఫీసర్ ఉంటారని చెప్పారు. మరి కోటికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో 35,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అందుకోసమే వార్డు కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డుకు పది మంది సిబ్బంది ఉంటారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డుకు నేతృత్వం వహిస్తారని చెప్పారు.
సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం సమయాన్ని కూడా ఇచ్చామని తెలిపారు. అందుకోసం సిటిజన్ చార్టర్ ఇచ్చామని చెప్పారు. జవాబు దారితనం, సుపరిపాలన కోసం వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు. వ్యక్తులు అశాశ్వతమనీ వ్యవస్థ శాశ్వతమని చెప్పారు. దేశం మొత్తం మనవైపు చూస్తుందని, ఎవరు వచ్చి ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను ఉపయోగించుకోవాలన్నారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వార్డు కార్యాలయాలను మానిటర్ చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
MA&UD Minister @KTRBRS speaking after inaugurating @GHMCOnline's Ward Office in Kachiguda Ward. #TrailblazerTelangana #TelanganaTurns10 https://t.co/AJJEwUK6tn
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 16, 2023