19 వేల పరిశ్రమలు
16.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
2021-22 నివేదికలో పరిశ్రమల శాఖ
నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపాస్) ద్వారా 19,454 పరిశ్రమలు వచ్చాయి. ఈ పరిశ్రమలు రాష్ట్రంలో రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. తద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
మొత్తం పరిశ్రమల్లో 15,660 పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మిగిలిన 3,794 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మొత్తం పరిశ్రమల్లో 3,938 పరిశ్రమలు, రూ.17,867 కోట్ల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనే రావడం గమనార్హం. వీటి ద్వారా 96,863 మందికి ఉపాధి అవకాశాలు లభించినట్టు 2021-22 వార్షిక నివేదికలో రాష్ట్ర పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ నివేదికను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం విడుదల చేశారు.
ఫార్మా రంగంలో..
దేశీయ ఫార్మా రంగానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతున్నది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 200% అధికంగా పెట్టుబడులు వచ్చాయి. దీన్ని బట్టే లైఫ్సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఎంత అనువుగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఫార్మా యూనివర్సిటీని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంలో ఈ యూనివర్సిటీని ఏర్పా టు చేయనున్నారు. ఈ వర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆయా కుటుంబాల్లోని 120 మంది యువతకు శిక్షణ ఇచ్చారు.
టీఎస్ఐఐసీ ద్వారా
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా గత ఏడేండ్లలో 56 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. వీటిలో 33 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 13 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. 810 ఎకరాల భూమిని వివిధ పరిశ్రమలకు కేటాయించారు. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ఉపాధి లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 52 ఎకరాల భూమిని కేటాయించారు.
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్
మూతపడిన, మూతపడే దశలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వాటిని తిరిగి తెరిపించేందుకు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేశారు. గత ఐదేండ్లలో రూ.5.39 కోట్ల సహాయాన్ని అందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 416 దరఖాస్తులు రాగా.. 376 పరిశ్రమలకు ఎలాంటి సహాయం లేకుండానే వాటి సమస్యలను పరిష్కరించారు.
నేతన్నలకు..
ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూసి చలించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ పేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి, వారికి నిత్యం ఉపాధి కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలకు అందించే స్కూల్ యూనిఫాం క్లాత్ను చేనేత, మరమగ్గాలపై తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఇలా నేతన్నలకు చేతినిండా పని లభించడం తో ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడింది. నేతన్నకు చేయూత పథకం కింద 20,537 మంది కార్మికులకు రూ.96.43 కోట్లు, చేనేత మిత్ర పథకం కింద 20,135 మందికి రూ.21.67 కోట్లు పంపిణీ చేశారు.
ఏరో స్పేస్ రంగంలో..
విమానయాన రంగంలో రాష్ట్రం వరుసగా మూడో సంవత్సరం కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి అవార్డును దక్కించుకొన్నది. మొదటి హైదరాబాద్లోని టాటా-లాక్హీడ్ మార్టిన్ కంపెనీ నుంచి అమెరికా లోని లాక్హీడ్ కంపెనీకి ఎఫ్-16 ఫైటర్ జెట్ వింగ్స్ను సరఫరా చేశారు. వీఈఎం టెక్నాలజీ సంస్థ సంగారెడ్డిలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనున్నది. టాటా-బోయింగ్ సంస్థ హైదరాబాద్ నుంచి అమెరికాలోని బోయింగ్ సంస్థకు 100వ అపాచీ ఫ్లూజ్లేజ్ను సరఫరా చేసింది. టాటా-లాక్హీడ్ మార్టిన్ కంపెనీ సీ-130జే సూపర్ హెర్క్యులస్ 150వ ఎంపన్నేజ్ను అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కార్యాలయానికి సరఫరా చేశారు. రోల్స్ రాయిస్ సంస్థ హైదరాబాద్లో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా పెరిగింది. వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల నుంచి 1,496 దరఖాస్తులు వచ్చాయి.
బతుకమ్మ చీరలకు..
బతుకమ్మ పండుగ జరుపుకొనే మహిళలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. 18 ఏండ్ల వయసు దాటిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తున్నారు. ఏటా దాదాపుగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారు. 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద 2021-22 వరకు రూ.1,437 కోట్లు ఖర్చు చేశారు.
జ్యూట్ బ్యాగ్ల తయారీ..
రాష్ట్రంలో జ్యూట్ బ్యాగ్ల తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్లతో మూడు చోట్ల జ్యూట్ బ్యాగ్లు తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. ఏటా 15-17 కోట్ల గన్నీ బ్యాగ్లను తయారు చేయనున్న ఈ మూడు కంపెనీల ద్వారా 10 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
43 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా..
పెట్రోల్లో కలిపేందుకు రాష్ట్రం 43 కోట్ల లీటర్ల ఇథనాల్ను సరఫరా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిని రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు 18,304 కిలో లీటర్లను సరఫరా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకుపైగా హెక్టార్లలో చెరుకు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
సోమవారం హైదరాబాద్లో పరిశ్రమలు, వాణిజ్యశాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు
పరిశ్రమలశాఖ సాధించిన కీలక విజయాలు