తెలంగాణ యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ మనసున్న నేత. ఆపదలో సాయం చేయడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అతడి నైజం. ఎవరికీ ఆపదొచ్చినా..వెంటనే స్పందిస్తారు.. ఆపన్నహస్తం అందిస్తారు. కల్మషం లేకుండా ప్రతిభ ఉంటే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. మీకు నేనున్నానని భరోసానిస్తారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు వెన్నంటి ఉంటారు. తాజాగా ఓ విద్యార్థి ఆలపించిన పాటకు కేటీఆర్ మంత్రముగ్ధుడై.. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి, ప్రశంసల వర్షం కురిపించారు.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి సాయి కుమార్.. తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు రాసిన.. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానులకు ఏమేరుక వారుండే స్థలము.. సద్గురుడుండే మరుగు.. అనే గేయాన్ని ఆలపించారు. ఈ పాట విన్న కేటీఆర్ మంత్రముగ్ధుడయ్యారు. సాయి కుమార్ భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలనీ కోరుకుందాం అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు రాసిన తత్వాల ఆధారంగా వచ్చిన గేయం ఇది అని కేటీఆర్ తెలిపారు.