ఫాక్స్కాన్
ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ.
మార్చి 2న ఒప్పందం జరిగింది.. మే 15న భూమి పూజ జరిగింది.. రెండున్నర నెలల్లోనే అన్ని అనుమతులూ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఒక భారీ పరిశ్రమ రావడం కోసం కేసీఆర్ సర్కారు ఎంత వేగంగా స్పందిస్తుంది.. పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్కాన్ రాక ఒక మేలిమలుపు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం యూకే- అమెరికా పర్యటనలో ఉన్నారు. కేవలం ఫాక్స్కాన్ భూమి పూజకు హాజరుకావడం కోసం మే 14 ఆయన హైదరాబాద్ వచ్చారు. మే 15 న ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన హైదరాబాద్లో గడిపింది కేవలం 24గంటలు.
తెలంగాణ యువతకు ఉపాధి కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తారనే దానికి ఇదొక తార్కాణం. నిజానికి కేటీఆర్ లండన్ నుంచి అటే నేరుగా అమెరికా పర్యటనకు వెళ్లి పోవచ్చు. కానీ, తెలంగాణకు ఫాక్స్కాన్ కంపెనీ ఎంత ముఖ్యమో గుర్తించిన కేటీఆర్ కేవలం 24 గంటల కోసం లండన్ నుంచి తెలంగాణకు వచ్చి మళ్లీ వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు.
హైదరాబాద్/రంగారెడ్డి, మే 15 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ, పరిశోధన, తయారీ తదితర రంగాల్లో విశ్వకేంద్రంగా ఉన్న చైనాలోని షెన్జెన్ నగరంలా తెలంగాణను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 30 ఏండ్లలో చైనా చేసిన పనిని తెలంగాణ 20 ఏండ్లలో చేస్తుందని, 1.5 మిలియన్ల శ్రామిక శక్తిని సృష్టించడంతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 150 బిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ) 500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఫాక్స్కాన్ తమ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకొన్నందుకు ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఫాక్స్కాన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఈ రోజు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకొన్న ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్, సీఈవో సిడ్నీ లియూసహా కంపెనీ ప్రతినిధి బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలల్లోనే కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందని స్పష్టం చేశారు. నేడు ఫాక్స్కాన్తో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
తొమ్మిదేండ్లలో 4 లక్షలకోట్ల పెట్టుబడులు
తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందని వివరించారు. తెలంగాణ తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందని వెల్లడించారు. తొమ్మిదేండ్లలో దాదాపు 22,700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించామని, సుమారు రూ.4 లక్షల కోట్ల పైచిలుకు (50 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. 30 ఏండ్ల కింద చైనా ఏ పరిస్థితిలో ఉందో.. నేడు భారత్ అదే పరిస్థితిలో ఉన్నదని, అయితే ప్రభుత్వాలు తలుచుకొంటే రాబోయే 20 ఏండ్లలోనే చైనా మాదిరి ప్రగతిని సాధించే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తున్నదని, 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20 వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నదని, దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రాధాన్యత
ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ తెలంగాణ వేగంపైన ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం తమపై ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 500 మిలియన్ డాలర్లు (4,114కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఫాక్స్కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా, మార్గదర్శకంగా ఉండేలా పనిచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రాబోయే పదేండ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇకడి యువతకు శిక్షణ ఇచ్చేలా ఫాక్స్కాన్ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపట్ల హర్షం వ్యక్తంచేశారు.
తెలంగాణ యువతకు విరివిగా ఉపాధి
తెలంగాణ యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యంకాదని పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలుసహా అన్ని రంగాలను కలుపుకొని 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నదని చెప్పారు. 0.5% మందికే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 2%కి పైగా ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఇచ్చే పరిస్థితి ఉండదని తెలిపారు.
తెలంగాణలో వర్క్ఫోర్స్ (40 కంటే తక్కువ వయసు) కోటి 50 లక్షల మంది ఉన్నారని, వారికి స్వయం ఉపాధి కింద అవకాశం కల్పించడం లేదా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు సాధించి ఆ రంగంలో ఉద్యోగ కల్పనకు విశేష కృషి చేయడం.. ఈ రెండు మార్గాలు మాత్రమే ఉంటాయని వెల్లడించారు. అందుకే అమెరికా, లండన్ తిరిగి పెట్టుబడులు సాధిస్తున్నామని, దీంతో యువతకు ఉపాధి లభించడమే కాదు.. అపారమైన సంపద వృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఇక్కడ ఫాక్స్కాన్ మొదటి దశతో 35 వేలనుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా ఒక్క ఐటీ ఉద్యోగానికి మూడింతల ఉద్యోగాలు వస్తాయని తాను సగర్వంగా చెప్తున్నాని అన్నారు. ఫాక్స్కాన్ కంపెనీతో ఈ ప్రాంతం ఐదేండ్లలోనే ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, జూబ్లీహిల్స్.. గచ్చిబౌలికి వెళ్తే హైదరాబాద్లో ఉన్నానా? లేక న్యూయార్క్లో ఉన్నానా? అని అనిపించింది అని సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారని గుర్తుచేశారు.
ఫాక్స్కాన్ కంపెనీ రావడం గర్వకారణం
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ర్టానికి వచ్చిన అతిపెద్ద పరిశ్రమ ఫాక్స్కాన్ అని, లక్ష ఉద్యోగాల కల్పనతో మన కొంగరకలాన్కు.. మన రంగారెడ్డికి రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన రాష్ర్టానికి మోదీ పెట్టే ఇబ్బందులను తట్టుకొని ఒక కంపెనీని తీసుకురావాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తున్నదని తెలిపారు. ఆ పరిశ్రమను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికుల మీదే ఉంటుందని చెప్పారు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, స్థానిక పిల్లలకు శిక్షణనిస్తామని, వారికే కొలువులు ఇస్తామని కంపెనీవాళ్లు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
తెలంగాణ తొమ్మిదేండ్లలోనే ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని, కేసీఆర్ సమర్థ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా మారిపోయిందని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. ఇక్కడ మిషన్ భగీరథ పూర్తిచేశాక.. కేంద్ర సర్కారు ‘హర్ ఘర్ జల్ మిషన్’ అని ప్రారంభించిందని, మనమిక్కడ రైతుబంధు ప్రారంభించి 65 లక్షల రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఇస్తే మూడేండ్లకు మేల్కొన్న కేంద్ర సర్కారు పీఎం కిసాన్ యోజనా అని చెప్పి నకలుకొట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొన్నదని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకొన్నదని తెలిపారు. మన పల్లెలు, పట్టణాలు 26 స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు అందుకొన్నాయని గుర్తుచేశారు.
అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి
ఒకవైపు పర్యావరణం, పచ్చదనం, అటవీ సంపద పెరుగుతున్నాయని, ఇంకోవైపు పరిశ్రమలు, ఐటీ ఎగుమతులు, వ్యవసాయం పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పాలమూరు పరుగులు’ అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’లో అద్భుతమైన వార్త వచ్చిందని, రైతులను బస్సుల్లో తీస్కొనిపోయి ఆ ప్రాజెక్టు పనులను చూయించుకురావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి చెప్పానని అన్నారు. ఎంత బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నయ్.. మన మహేశ్వరం, కొంగరకలాన్కు ఎంత వేగంగా నీళ్లు రాబోతున్నయో రైతులకు చూపెడితే వారికి విశ్వాసం కలుగుతుందని తెలిపారు. దశాబ్దాలపాటు ఈ ప్రాంతానికి నీళ్లు ఇయ్యనోళ్లు మళ్లీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారని, నిరుద్యోగ మార్చ్ అంటూ మరొకరు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ప్రధాని మోదీ గనుక హామీ ఇచ్చినట్టు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే.. తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు తెచ్చి ఉంటే ఎందుకు నిరుద్యోగ మార్చ్ చేయాల్సి వస్తది అని తాను ఆ ప్రతిపక్ష నాయకులను ప్రశ్నిస్తున్నానని అన్నారు. తెలంగాణలో ఉన్న ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకుగానూ 2 లక్షల 20 వేల ఉద్యోగాల భర్తీ నడుస్తున్నదని, లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఇంకా 80 వేల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇవన్నీ నిండితే కేసీఆర్కు మంచి పేరు వస్తదని కొంతమంది దరిద్రులు టీఎస్పీఎస్సీలో చొరబడి ఉద్యోగ పరీక్ష పేపర్లు.. పదో తరగతి పేపర్లు లీక్ చేసి గబ్బుగబ్బు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు తెలంగాణలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు పచ్చబడితే.. రంగారెడ్డికి నీళ్లొస్తే వాళ్ల కడుపు మండుతున్నదని అన్నారు. వాళ్లు వచ్చి నాటకాలాడితే నమ్ముదామా? అని ప్రశ్నించారు.
అన్నిచోట్ల గులాబీ జెండా ఎగురాలి
తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతున్నదంటే ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కేసీఆర్ రూపంలో మనకు ఇక్కడ ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సారి వంద సీట్లు సాధించి.. మన ప్రభుత్వం సత్తా, కేసీఆర్ పనితీరును ప్రపంచానికి చాటుదామని పిలుపునిచ్చారు. ‘ఒక్క పార్టీవాళ్లేమో మత పిచ్చోళ్లు.. హిందూ ముస్లిం, క్రిస్టియన్ పంచాయతీపెడ్తరు.. ఒక్క నిర్మాణాత్మక ముచ్చట మాట్లాడరు.. ఇది తవ్వుదాం.. అది కూలగొడుదాం అనే దిక్కుమాలిన దందా తప్ప మరోటి ఉండదు.. ఇంకో పార్టీ ఉన్నది.. దశాబ్దాలుగా చేసిందేమీ లేదు.. ఈరోజు చేయగలిగేదికూడా ఏమీ లేదు.. అందుకే తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా గులాబీ జెండానే రెపరెపలాడాలె. మనకు పచ్చని పంటలతో ఉన్న తెలంగాణ గావాలె.. కొలువులున్న తెలంగాణ గావాలె. మతం మంటలతో మండిపోయే తెలంగాణ వద్దు. కులం పిచ్చితోటి పిచ్చిపిచ్చి అయిపోయే తెలంగాణ వద్దు..అభివృద్ధే మన మతం.. సంక్షేమమే మన కులం.. జనహితమే మన అభిమతం.. ఆ దిశగా అందరం కలిసికట్టుగా కదంతొక్కుదాం..’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతున్నదంటే ఇక్కడ ఉన్న స్థిరమైన ప్రభుత్వం, కేసీఆర్లాంటి సమర్థ నాయకత్వమే కారణం. అందుకే తెలంగాణకు పరిశ్రమలు క్యూకడు తున్నాయి. ఈసారి వంద సీట్లు సాధించి.. మన ప్రభుత్వం సత్తా, కేసీఆర్ పనితీరును ప్రపంచానికి చాటుదాం.
-కేటీఆర్
కేసీఆర్, కేటీఆర్ కృషితో ఉన్నతస్థానంలో తెలంగాణ: మంత్రి సబితా
తెలంగాణ పట్ల నిబద్ధత, పరిపూర్ణమైన అవగాహనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ర్టాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి, రాష్ర్టానికి పెట్టుబడులను రప్పించడంలో మంత్రి కేటీఆర్ సఫలీకృతులవుతున్నారని కొనియాడారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఫాక్స్కాన్ అత్యంత కీలకమైనదని, ఈ సంస్థ పూర్తిస్థాయిలో తన ఉత్పత్తులను ప్రారంభిస్తే లక్షమందికి పైగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై ఫాక్స్కాన్ చైర్మన్ ప్రశంస
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీకి శంకుస్థాపన చేయడం తెలంగాణకు చారిత్రాత్మక సందర్భమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని, లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఈ ఏడాది మార్చి 2న ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ తైవాన్నుంచి వచ్చి సీఎం కేసీఆర్తో ఒప్పందం చేసుకొన్నారని చెప్పారు. సరిగ్గా రెండున్నర నెలల్లో 200 ఎకరాల్లో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో, 35 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా కంపెనీకి శంకుస్థాపన చేసుకొన్నామని వివరించారు. భారతదేశంలో తాము ఐదారు రాష్ర్టాల్లో పనిచేస్తున్నాం కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నంత వేగంగానీ, తెలంగాణలో ఉన్నంత సమర్థ నాయకత్వంగానీ ఎక్కడా లేదని ఫాక్స్కాన్ చైర్మన్ చెప్తుంటే చాలా చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది అని తెలిపారు.
షెన్జెన్ నగర ప్రత్యేకత..
షెన్జెన్ అనేది చైనాలోని ఓ నగరం. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఒకటి. టెక్నాలజీ, తయారీ, పరిశోధన, వ్యాపారం, ఆర్థికం, ఫైనాన్స్, టూరిజం, రవాణాలో ప్రపంచానికే కేంద్రంగా ఉంది. లార్జ్పోర్ట్ మెగా సిటీగా దీనికి పేరుంది. హాంకాంగ్కు దగ్గరలో ఉన్న ఈ నగరం 1980ల ప్రారంభంలో డెంగ్ జియావోపింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో చైనాలోనే ప్రత్యేక ఆర్థిక జోన్గా మారింది. 30 ఏండ్లలోనే సాంకేతికత, అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్స్కు కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో టాప్ 10లో కొనసాగుతున్నది. గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మారిన ఈ నగరాన్ని చైనా సిలికాన్ వ్యాలీ అనికూడా పిలుస్తారు. ఒక ముఖ్యమైన అంతర్జాతీయ నగరంగా మారిన షెన్జెన్.. ప్రతి ఏటా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
‘పాలమూరు పరుగులు’ అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’లో ఫొటోలతో అద్భుతమైన వార్త వచ్చింది. రైతులను బస్సుల్లో తీస్కొనిపోయి ఆ ప్రాజెక్టు పనులను చూయించుకురావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి చెప్పా. ఎంత బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నయ్.. మన మహేశ్వరం, కొంగరకలాన్కు ఎంత వేగంగా నీళ్లు రాబోతున్నయో రైతులకు చూపెడితే వారికి విశ్వాసం కలుగుతుంది.
-కేటీఆర్
ఫాక్స్కాన్ ఘనత కేటీఆర్దే : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రశంస
తెలంగాణలో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు అవుతున్నదంటే అది మంత్రి కేటీఆర్ ఘనతేనని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. 2014 నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రతీకగా ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం.. ప్రశాంతమైన వాతావరణం.. మెరుగైన మౌలిక సదుపాయాలు.. అందరిని ఆహ్వానించే, స్వాగతించే సంస్కృతి.. అద్భుతమైన ప్రజలు ఉండటంతో తెలంగాణకు పెట్టుబడులు సాధ్యమవుతున్నాయని చెప్పారు.