Minister KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తమది మనసున్న, మానవీయ ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు. కేంద్రం రాష్ర్టానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకొకటి ఏర్పాటు చేసుకున్నామని, విద్య, వైద్యరంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. తొమ్మిదేండ్లలో తాము చేసినంత అభివృద్ధి గత పాలకులు ఎవరైనా చేశారా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్లలో శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి ఆలయం, ఎల్లారెడ్డిపేటలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వస్త్ర వ్యాపార సంఘం భవనంలో నిర్వహించిన కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని సింగరేణి సంస్థ సహకారంతో తంగళ్లపల్లి చెక్పోస్టు నుంచి వెంకట్రావుపల్లె సరిహద్దు దాకా రహదారి వెంట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
తర్వాత పద్మనాయక కల్యాణ మండపంలో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవ వేడుకలకు హాజరై పది మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీచేశారు. సాయంత్రం తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత పాలకులు 60 ఏండ్లలో చేసిన అభివృద్ధికి, తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, నక్కకు నాగలోకానికి ఉన్న తేడాలా కండ్ల ముందు కనిపిస్తుందని స్పష్టం చేశారు. నాడు సర్కార్ దవాఖాన అంటే దైన్యమని, నేడు ఒక ధైర్యమని పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నోస్టిక్ కేంద్రాల దాకా ప్రతి ఆలోచన ప్రతిష్ఠాత్మకమని, వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ప్రైవేటులో పైసలు ఖర్చుపెట్టుకోలేని పేదలే సర్కారు దవాఖానకు వస్తున్నారని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాలని వైద్యులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానలో ప్రసవించిన తల్లీబిడ్డను క్షేమంగా ఇంటి వద్దకు చేరుస్తున్నదని, కేసీఆర్కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నదని వివరించారు. వైద్య, ఆరోగ్య విషయంలో నీతి ఆయోగ్ సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
తిరుపూరుకు ధీటుగా, ప్రపంచంతో పోటీ పడేలా వస్త్ర ఉత్పత్తుల తయారీతో సిరిసిల్లను అగ్రభాగాన నిలుపాలని వస్త్ర వ్యాపారులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇతర రాష్ర్టాల్లో వెరైటీ ఉత్పత్తులను పరిశీలించేందుకు స్టడీ టూర్కు వెళ్లి రావాలని సూచించారు. ఎంపీ బండి సంజయ్కు చేతనైతే సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ను కేంద్రం నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
టీటీడీ ఆర్థిక సహకారంతో జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరిన వెంటనే ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారంటూ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో గుడులు, బడులు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. సీఎం సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు. ఇరవై రోజుల్లో మల్కపేట రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించున్నట్టు వెల్లడించారు. మానసికంగా డిప్రెషన్కు లోనయిన వారి కోసం ప్రత్యేకంగా ‘కిరణం’ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఎవరైనా బాధితులుంటే టోల్ఫ్రీ నంబర్ 1800425333కు ఫోన్ చేయాలని సూచించారు. వృద్ధాశ్రమాలకు వచ్చే స్పందన బట్టి ఇతర మండలాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు బాధపడవద్దని, సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాకు రూ.166 కోట్లతో సీఎం మెడికల్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. గుండె జబ్బు మరణాలను తగ్గించేందుకు జిల్లాలో 2,265 మందికి సీపీఆర్ చికిత్సలో శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసించారు. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారిపోయాయని కొనియాడారు. హెలీకాప్టర్లో వస్తున్నప్పుడు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ జలాశయాలను చూస్తుంటే చాలా సంతోషం కలిగిందని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసింనందుకు సీఎం కేసీఆర్ను ప్రజలంతా తరతరాలుగా గుర్తుచేసుకుంటారని అన్నారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 14: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఓ వృద్ధుడితో 10 నిమిషాల పాటు ముచ్చటించారు. ఆశ్రమంలోకి వెళ్లగానే కనిపించిన జిల్లెల్లకు చెందిన ఎల్లయ్యను ఆప్యాయంగా పలుకరించారు. తనకు 80 ఏండ్ల వయస్సున్నదని ఎల్లన్న చెప్పడంతో ‘ఎల్లన్నా.. నువ్వు సెంచరీ కొట్టాలే. నిండు నూరేండ్లు బాగుండాలి’ అని కేటీఆర్ ఆకాంక్షించారు. ‘నా కొడుకులు నన్ను పట్టించుకుంటలేరు. ఇల్లు కూడా తీసుకుని పంపించారు’ అని ఎల్లన్న ఆవేదన వ్యక్తం చేయగా, ‘నీకు మేమున్నాం.. ఇక్కడే ఉండు.. బాగా చూసుకుంటాం’ అంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘నా ఇల్లు నాకు ఇప్పియ్యాలె కొడుకా’ అని ఎల్లన్న వేడుకోగా, 80 ఏండ్లు వచ్చినంక కూడా కొడుకుల మీద కోపమెందుకే..? మళ్లీ వాళ్లు వచ్చి కాళ్లు మొక్కితే ఇల్లు ఇవ్వవా?’ అని మంత్రి అడిగారు. ‘నన్ను బాగా చూసుకుంటలేరు బిడ్డా.. బాగా చూసుకుంటే చూస్తా’ అని వృద్ధుడు బదులిచ్చాడు. ‘కలెక్టర్ సారు ఇక్కడే ఉన్నడు.. నువ్వు గట్టిగా నిలబడితే.. ఇల్లు తీసుకోవచ్చు.. కలెక్టర్కు కాగితం ఇవ్వు.. చూసుకుంటారు’ అని మంత్రి భరోసా ఇచ్చారు.