హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ పర్యావరణ, జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ) ఆహ్వానించింది. అమెరికాలోని హెండర్సన్లో మే 21 నుంచి 25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆరేండ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో నిర్వహించిన ఈ సంస్థ వార్షికోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. అప్పుడు ముఖ్యోపన్యాసం చేసిన కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాలను వివరించారు.
ఈ భారీ పథకాలను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన సాహసోపేతమైన, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ఆ నాటి సమావేశంలో మంత్రి కేటీఆర్ వివరించారు. ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్తోపాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్ నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పరిధి-సామర్థ్యంతోపాటు నిర్మాణంలో చూపించిన అద్భుతమైన వేగానికి ఆ ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది. మంత్రి కేటీఆర్ను కలిసిన ఆ ప్రతినిధి బృందం, ఒక బృహత్ సంకల్పాన్ని అతి తకువ సమయంలోనే వాస్తవంగా మార్చినందుకు అభినందనలు తెలియచేశారు.
ఈ మెగా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలతోపాటు సస్యశ్యామల మాగాణంగా తెలంగాణ మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని మంత్రి కేటీఆర్కు పంపిన ఆహ్వాన లేఖలో ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ సంస్థ కోరింది. 177 దేశాలకు చెందిన 1,50,000 కంటే ఎకువ మంది సివిల్ ఇంజినీర్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్లో సభ్యులుగా ఉన్నారు. 1852లో స్థాపించిన ఈ సంస్థ అమెరికాలోనే అతి పురాతన ఇంజినీరింగ్ సొసైటీ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిషారంతోపాటు నీటి వనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తున్నది.