హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ (Foxconn) టెక్నాలజీస్ ప్లాంట్కు మంత్రి కేటీఆర్ (Minister KTR) భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్కాన్ ఇక్కడ తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లియూతో (Young liu) కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. సుమారు 70 శాతం యాపిల్ ఐఫోన్లను ఫాక్స్కాన్ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్ కంపెనీ ఎయిర్పాడ్లు, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్ను ఫాక్స్కాన్కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్కాన్, ఇప్పుడు ఎయిర్పాడ్ల తయారీలోకి అడుగు పెడుతున్నది. ఇటీవలే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధిబృందం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించిన విషయం తెలిసిందే.