హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం చింతలతండా గ్రామపంచాయతీలో 42 డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు.
ఉదయం 11 గంటలకు జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్, డీఈఐసీ (DEIC) సెంటర్, మాతృసేవా కేంద్రాలను, హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిస్తారు.11.30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మధ్యాహ్నం 12 గంటలకు మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్ను, 12.30 గంటలకు శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు గుడి చెరువు అభివృద్ధి పనులకు, 1 గంటలకు బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.