అగ్నిపథ్ ప్రమాదకరం
దేశ భద్రతను కాంట్రాక్టుకు ఇస్తారా?
ఆర్మీ ఉద్యోగార్థులను వంచించిన కేంద్రం
ఇదేనా దేశ భద్రతపై బీజేపీకి ఉన్న తపన?
ఇప్పటికే సైన్యంల్లో నో ర్యాంక్ నో పెన్షన్!
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే సమీక్షించాలి
దేశవ్యాప్త అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత
ఏ వర్గం ఆకాంక్షలూ పట్టని మోదీ సర్కారు
మొన్న రైతులు, నేడు యువత ఆగ్రహం
కేంద్రంపై మంత్రి కేటీఆర్ మండిపాటు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో, మొన్నటిదాకా నల్ల చట్టాలతో రైతుల గోస పుచ్చుకొన్న కేంద్రం, ఇప్పుడు అగ్నిపథ్తో జవాన్లను నిర్వేదంలోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సైన్యాన్ని వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నో ర్యాంక్ -నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వంతో ఎలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని మండిపడ్డారు.
అగ్నిపథ్పై అనేక అనుమానాలు
అగ్నిపథ్ పథకంపై అనేక అనుమానాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు, పరిపాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరిన సమయంలోనే సైనికోద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది యువత అశలను వంచించేలా కేంద్రం నిర్ణయం తీసుకొన్నదని విమర్శించారు. దేశ భద్రతను సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలనుకోవటం దేశ రక్షణపై వారి బీజేపీ డొల్లవిధానాలకు నిదర్శనమని అన్నారు. అగ్నిపథ్ వల్ల దేశ భద్రతతో పాటు యువత భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగమెలా?
అత్యంత కీలకమైన యుక్త వయసులో సైన్యంలో చేరినవారిని నాలుగేండ్లకే బయటకు పంపిస్తే, ఆ తర్వాత వారికి ఉపాధి దొరికే అవకాశమే లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. 75 శాతం సైనికులను ఏటా నిరుద్యోగులుగా మార్చే ఈ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. నాలుగేండ్ల తర్వాత బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధమని మండిపడ్డారు. ప్రైవేటు రంగంలో ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎనిమిదేండ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాట ఎంత నిజమో, ఇదీ అంతే నిజమని ఎద్దేవా చేశారు. ఈ వివాదస్పద విధానంతో దశాబ్దాలుగా సైన్యంలో ఉన్న సంస్థాగత సంసృతి, సంప్రదాయాలు, విలువలకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభద్రతకన్నా ఆర్థిక అంశాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి యువత ఆవేదనను అర్థం చేసుకొని అగ్నిపథ్ విధానాన్ని పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్పై ఆందోళన చేస్తున్న యువత ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఈ విధానంపైన సమీక్షకు నిరుద్యోగుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజల ఆకాంక్షలు పట్టవా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఏ వర్గాన్నీ సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశ పౌరుల బాధలను పరిగణనలోకి తీసుకోకుండా నోట్ల రద్దు, లాక్డౌన్, మైనారిటీలతో చర్చించకుండా సీఏఏ వంటి నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. తాజాగా యువత ఆకాంక్షలకు భిన్నంగా, అనాలోచితంగా అగ్నిపథ్ విధానాన్ని తీసుకొచ్చింది’ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్న యువకులపైనే నెపాన్ని నెట్టే దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసనలో యువకుడి మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ సానుభూతి తెలిపారు.