హైదరాబాద్: ప్రభుత్వాన్ని నడపడమంటే ఇల్లు నడిపినంత ఈజీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ఐటీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం ప్రగతి సాధించదని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 111 జీవో తన కోసమే ఎత్తివేశారని ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 111 జీవో పరిధిలో లక్షా 30 వేల ఎకరాలు ఉన్నాయని, అవన్నీ తనవేనా అని ప్రశ్నించారు. జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవో పరిధిలో అద్భుతమైన కొత్త నగరాన్ని సృష్టించవచ్చని తెలిపారు.
దేశంలో కెల్లా హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. నగరంలో రోడ్ల అభివృద్ధిని చూసీ సీజేఐ ఎన్వీ రమణ మెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి బిల్డర్లు వస్తున్నారని పేర్కొన్నారు. మన దగ్గర నుంచి ఎంత బిల్డర్లు బయట రాష్ట్రాలకు వెళ్తున్నారని అడిగారు.
హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. తాగునీటికోసం జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్లో ప్రతిరోజు తాగునీరు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్లోపు వందశాతం ఎస్టీపీ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.