హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ షాక్ వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఆ సంఘటనపై స్పందించారు. ఖేరి రైతులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో ఆరోపించారు. అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనాగరికమైన ఆ చర్యను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతు హత్యలకు పాల్పడిన వారిని త్వరలోనే శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో ఇదే ఘటనకు సంబంధించిన మరో రెండు ట్వీట్లను రీపోస్టు చేశారు. కేంద్ర మంత్రి కోడుకు తన కారుతో రైతులను తోక్కించి చంపిన వీడియోను ఓ వ్యక్తి పోస్టు చేశాడు. ఆ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నేత క్రిశాంక్ పోస్టు చేసిన ట్వీట్ను ఆయన రీట్వీట్ చేశారు. నిరసనలు చేస్తే రైతులకు బుద్ధి చెబుతం అని రైతులు చనిపోయే కొద్ది గంటల ముందు లఖింపురి ఖేరిలో కేంద్ర మంత్రి రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి రీట్వీట్ చేశారు.