హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పారిస్ వరల్డ్ స్కూల్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలంగాణ గురుకుల విద్యార్థులు రవికిరణ్, మాయావతిను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. తొలిసారి బరిలోకి దిగిన అంతర్జాతీయ టోర్నీలో పతకాలు చేజిక్కించుకున్న వారిద్దరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎంతో అభినందనీయం’ అని వారిని అభినందిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు.
షేక్పేట స్పోర్ట్స్ అకాడమీకి చెందిన రవికిరణ్ జావెలిన్ త్రోలో 30.74 మీటర్ల దూరం బల్లెం విసిరి పసిడి పతకం కొల్లగొట్టగా.. 200 మీటర్ల రేసులో మాయావతి 24.68 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం చేజిక్కించుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన రవికిరణ్ పసిప్రాయంలోనే పోలియో బారిన పడినా.. మొక్కవోని దీక్షతో అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకోవడం విశేషం. ఎస్సీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తాము తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.