KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని, మహిళల కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్లో క్యాపిటల్యాండ్ సంస్థ కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్(ఐటీపీహెచ్)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి కంపెనీ పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని పేర్కొన్నారు. మానవులకు సంబంధించి 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే తయారవుతున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా 9 బిలియన్ డోసులు ఇక్కడ తయారవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 14 బిలియన్ డోస్లు తయారు చేయాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
40% ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే
దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయని, నగరం లైఫ్ సైన్సెస్ హబ్గా మారుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యూఎస్ఎఫ్డీఏ అనుమతులు (214) కలిగిన నగరంగా హైదరాబాద్ ఉందని, రెండో నగరం న్యూజెర్సీ (189) అని తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. మానవ వనరులకు ఇక్కడ కొరత లేదని, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని పేర్కొన్నారు. స్టార్టప్లా ఆలోచిస్తాం.. స్టార్టప్లా పనిచేస్తుంటామన్నారు.
గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారడంతో కంపెనీలు మరింత వృద్ధి చెందడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతోపాటు అవసరమైన మద్దతు అందించేందుకు అంకితభావంతో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటీ, లైఫ్సైన్సెస్ రంగాల్లోనే కాకుండా లాజిస్టిక్, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు కేంద్రంగా మారిందని, ఈ రెండు రంగాల్లోనూ క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సింగపూర్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ జెస్సికా, సీఎల్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానీ, ఐటీశాఖ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఆత్మకూరి అమరనాథ్రెడ్డి, ఇండియా బిజినెస్ పార్కు సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి భేష్
క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (సీఎల్ఐ) ఇండియా సీఈఓ సంజీవ్దాస్గుప్తా మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని, ఇక్కడ తమకు 30 ఏండ్ల అనుభవం ఉందని తెలిపారు. దేశంలోని 6 నగరాల్లో 12 వ్యాపార పార్కులను కలిగి ఉండగా, అందులో హైదరాబాద్లోనే 3 ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని తమ వ్యాపార కేంద్రాల్లో 90 శాతం ఆక్యుపెన్సీ ఉందని, బహుళజాతి కంపెనీలకు చెందిన 1.50 లక్షల మంది పనిచేస్తున్నాని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి అద్భుతమని కొనియాడారు. ఇక్కడ ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పన అత్యంత మెరుగ్గా ఉందన్నారు. తాము కొత్తగా నిర్మించిన వ్యాపార భవనంలో సుమారు 1.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.