ఎంఎస్ఎంఈల వేగవంత అభివృద్ధికి మార్గం
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ సెంటర్లు రావాలి
మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మనదేశంలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఐఏఎంసీ) పారిశ్రామిక ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో తొలి ఐఏఎంసీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుండటంపై హర్షం వ్యక్తంచేశారు. అందుకు చొరవచూపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సతీశ్చంద్ర, జస్టిస్ నాగేశ్వర్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హెచ్ఐసీసీలో జరిగిన ఐఏఎంసీ సన్నాహక సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని, అనేక దేశాలకు చెందిన ఇండస్ట్రీలను పరిశీలించి, పారిశ్రామికవేత్తలు, అధికారులతో ఎంతో మేధోమథనం సాగించి సీఎం కేసీఆర్ టీఎస్ఐపాస్ను తీసుకొచ్చారని గుర్తుచేశారు.
పారిశ్రామికంగా ప్రగతి సాధించడానికి పెట్టుబడిదారులను ఆకర్షించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పారదర్శక సేవలు అందిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైనే కాకుండా వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడంపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఐఏఎంసీ ఏర్పాటు ఆ దిశగా దేశం వేసిన గొప్ప ముందడుగన్నారు. ఎంఎస్ఎంఈల ప్రగతికి ఐఏఎంసీ ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సెంటర్ ఆవశ్యకతపై విస్తృతంగా చర్చ జరుగాలని, అందుకు ఫిక్కీ, నాస్కామ్, ఫెటాప్సీ, ఐసీఎం తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఐఏఎంసీ విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పారిశ్రామిక వివాదాల పరిష్కార, మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటుతో అంతర్జాతీయ పారిశ్రామిక వివాదాలు వేగంగా పరిష్కారం కావడమేకాకుండా కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేశారని చెప్పారు.