హైదరాబాద్, హిమాయత్నగర్ మే 22 (నమస్తే తెలంగాణ) : దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. దళిత బాలికల విద్యా వికాసానికి ఆయన 26 పాఠశాలలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఆదివారం తెలంగాణ సాంస్కృతికశాఖ, ఆది హిందూ సభ సర్వీసింగ్ లీగ్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సభకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ నిజాం ఏలుబడిలో అధికార భాషగా ఉర్దూ ఉన్నా తెలుగు మీడియం సూళ్లను ఏర్పాటుచేసిన ధీశాలి భాగ్యరెడ్డివర్మ అని పేర్కొన్నారు. నేటి యువతకు భాగ్యరెడ్డివర్మ జీవితం స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ప్రజా గాయకుడు గద్దర్, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ రచయిత్రి డాక్టర్ బీ వీ జయభారతి, రిటైర్డ్ ఐపీఎస్ పీ వెంకయ్యకు భాగ్యరెడ్డివర్మ స్మారక జీవిత సాఫల్య పురసారాలను ప్రదానం చేశారు.