ధర్మపురి : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి ఎస్హెచ్ గార్డెన్స్లో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెంచారన్నారు.
కొవిడ్ తర్వాత వైద్య,ఆరోగ్య వ్యవస్థను మరింత పునర్నిర్మించుకుంటూ వచ్చారన్నారు. పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ వైద్యరంగంలో ప్రభుత్వం గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సమైక్య పాలనలోప్రజారోగ్యం గాలికి ఆరోపించారు. నిజాం హయాంలో నిర్మించిన నిమ్స్(NIMS), గాంధీ(Gandhi), ఉస్మానియా, వరంగల్లో ఎంజీఎం తప్పా సమైక్య పాలనలో పెద్ద దవాఖానలు నిర్మించలేదన్నారు.
ఈ సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్(CM KCR) ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద దవాఖానలు రాష్ట్రంలో మరో నాలుగు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ల్యాబ్లలో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం మాతాశిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.