ధర్మారం, అక్టోబర్20 : రెండు రోజుల క్రితం వరంగల్ ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్ది, నరసింహులపల్లి ,బుచ్చయ్యపల్లి, బొట్ల వనపర్తి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిఫ్ట్ మాత్రమే చదివారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి రాహుల్ గాంధీకి ఎలాంటి అవగాహన లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, వారి కలలు నెరవేరే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ స్కీములన్నీ గ్యారంటీ లేనివని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజలకు మేలు చేయలేదని, ఇప్పుడు ఏదో చేస్తామని చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మరన్నారు. సీఎం కేసీఆర్కు ప్రజా సంక్షేమం ఎంతో ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేవలం రాజకీయ అధికారం మాత్రమే కావాలని ఆయన ఎద్దేవా చేశారు.