హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాలకు చెందిన అధికారులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్తో బుధవారం ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. కేటాయించిన నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నడుస్తున్న 43 గురుకులాలను సంబంధిత నియోజకవర్గాలకు మార్చాలని మంత్రి ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అవసరమైన ఏఎన్ఎంలు, నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకాల కోసం జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్రాస్ పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ బ్రోచర్ను మంత్రి ఆవిషరించారు.
బడిపిల్లలకు ప్రతి శుక్రవారం వైద్యపరీక్షలు
వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. ఏఎన్ఎంల చేత విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రతి శుక్రవారం విద్యాసంస్థల్లో డ్రైడేను చేపట్టాలని, మధ్యాహ్న భోజనం, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలిచ్చారు.