చండూరు, అక్టోబర్ 25: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కుట్రలు సాగవని, ధన బలం తో బీజేపీ ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. చండూరు మండలం తాస్కానిగూడెం, బోడంగిపర్తి గ్రామాల టీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం చండూరులో సమావేశం నిర్వహించారు. బోడంగిపర్తిలో మైనార్టీ నేత రజబ్ అలీ ఆధ్వర్యంలో పలువురు మైనార్టీ నేతలు కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బీజేపీ అభ్యర్థిని కలిసికట్టుగా ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలకన్నా ముందు మునుగోడుకు తాగునీరిచ్చి విషపునీళ్ల నుంచి విముక్తి కలిగించింది కేసీఆరే అని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్కే ఉన్నాయని చెప్పారు. సమావేశంలో మైనార్టీ నేతలు షర్ఫోద్దీన్. సుజావుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్, చిట్టిబాబు. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.