హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎంటర్ప్రెన్యూర్ కల్చర్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గుజరాతీలకు ఎంటర్ప్రెన్యూ ర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, వారి నుంచి ఇతర ప్రాంతాల ప్రజలు ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించనున్న ప్లాస్ట్ ఇండి యా-2023 ఎగ్జిబిషన్కు సంబంధించిన యాప్ను శనివారం ఆయన హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో ఎంటర్ప్రెన్యూర్కు ఎక్కువ ప్రాధా న్యం ఇస్తారని చెప్పారు. కానీ మన దేశంలో ఇంజినీర్, డాక్టర్, సీఏ, లాయర్ మరేదో కావాలని తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు సూచిస్తారని, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని ఎవరూ చెప్పరని పేర్కొన్నారు.
ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్ కావడం అంత సులువు కాదన్నారు. దేశంలో ఎవరైనా వ్యాపారవేత్తగా మారితే ఆయన వెనక ఎవరు ఉన్నారు? మంత్రి ఉన్నా డా? ఏ నాయకుడు ఉన్నాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. గుజరాతీయుల రక్తంలోనే ఎంటర్ప్రెన్యూర్ లక్షణాలు ఉన్నాయని, అక్కడి నుంచే పెద్దపెద్ద వ్యా పారవేత్తలు వచ్చారని చెప్పారు.
1987 నాటికి భారత్, చైనా జీడీపీ ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. మన దేశంలో అనుకున్నం త స్థాయిలో మార్పు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎందుకు వెనకబడ్డామో, చైనా సాధించినది మనం ఎందుకు సాధించలేకపోయామో ఆలోచించాలని కోరారు.
తెలంగాణకు పరిశ్రమలను తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దుస్తుల తయారీ కంపెనీ కిటెక్స్ను రాబట్టడంలో చురుకుగా వ్యవహరించామని, గుజరాత్కు చెందిన పలు ప్రముఖ కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. తెలంగాణ పురోగామి రాష్ట్రమని, పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని వివరించారు. తెలంగాణలో 2014 నా టికి 10 వేల ప్లాస్టిక్ పరిశ్రమలు ఉండగా ఇప్పు డు వాటి సంఖ్య 15 వేలకు పెరిగిందని తెలిపారు.
వీటి ద్వారా రూ.7,500 కోట్ల వ్యాపా రం జరుగుతున్నదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 144 ఎకరాల్లో ప్లాస్టిక్పార్కు ను ఏర్పాటు చేశామని, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రూ.123 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. 149 కంపెనీలకు భూములు కేటాయించామని, వీటి ద్వారా రూ.847 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 5 వేల మందికి ఉపాధి లభించిందని వివరించా రు.
ప్రత్యామ్నాయం చూపకుండా ప్లాస్టిక్ను నిషేధించడం వల్ల ఫలితాలు రావ న్నారు. ప్లాస్టిక్ను రిసైకిల్ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ప్లాస్ట్ ఇం డియా-2023 ఎన్ఈసీ చైర్మన్ అజయ్షా, కో -చైర్మన్ పద్మజారెడ్డి టీఏఏపీఎంఏ అధ్యక్షుడు విమలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ను మొదటిసారి ఆరేండ్ల క్రితం అహ్మదాబాద్లో కలిశా. తెలంగాణకు పరిశ్రమలు తీసుకరావాలనే తపన ఆయనలో చూశా. ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయండంటూ కేటీఆర్ నంబర్ ఇచ్చారు. ఆశ్చర్యపోయా. ఈ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. పెట్టుబడులు రాబట్టడంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు సరికొత్తగా అనిపించింది. చిత్తశుద్ధి, తపన కనిపించింది. నాకు ఏ రాష్ట్ర మంత్రీ ఈ విధంగా ఫోన్ నంబర్ ఇవ్వలేదు.
ఏడాదిన్నర క్రితం సోలార్ గ్లాస్ ఫ్యాక్టరీ పెట్టడానికి కొన్ని రాష్ర్టాలను పరిశీలించాం. నాది గుజరాత్. కాబట్టి గుజరాత్, ఆ తరువాత తెలంగాణను పరిశీలించాం. జయేశ్రంజన్కు మెయిల్ చేశాం. పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడి పరిస్థితులను పరిశీలించండి, మేము ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని జయేశ్రంజన్ ఆఫర్ చేశారు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయా. నాకు తెలిసిన వారికి పెట్టుబడులు పెట్టేందుకు మొదట తెలంగాణను పరిశీలించండని చెప్తున్నా.
పరిశ్రమల స్థాపనకు అనువైన, అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉన్నది. మంత్రి కేటీఆర్లో రాష్ర్టానికి పరిశ్రమలను రాబట్టడంలో ఒక గుజరాతీ, మార్వాడీ కనిపిస్తున్నారు (నవ్వుతూ). 2025 నాటికి మా విశాఖ కంపెనీ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటుచేస్తాం. ఇక్కడ పెట్టుబడి పెట్టడం మంచి అవకాశంగా భావిస్తాం.
– జిగేష్ దోషి, అధ్యక్షుడు, ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్