Minister Krishna Rao | స్పెయిన్లో జరిగే అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు బృందం మాడ్రిడ్ చేరుకుంది. అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య ప్రదర్శన ఈ నెల 28 వరకు మాడ్రిడ్డ్లోని ఇఫెమాలో జరుగనున్నది. ప్రకృతి, పర్యావరణం, సాహసాలు, చారిత్రిక, ఆధ్యాత్మిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజానికి ఉన్న అవకాశాలను తెలంగాణ బృందం ఈ ప్రదర్శనలో ప్రదర్శించనుంది. పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న తాజా ధోరణులను అధ్యయనం చేయనుంది. పర్యాటక రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు.
ఫలితంగా తెలంగాణలో టూరిజం విభాగాన్ని ఆదాయ విభాగంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగానికి మరింత ఊతం లభించనుందని, తద్వారా ప్రపంచ పర్యాటకులు తెలంగాణను సందర్శించే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కే నిఖిల, ఎండీ రమేశ్ నాయుడు మంత్రితో కలిసి స్పెయిన్ పర్యటనకు వెళ్లారు.