సూర్యాపేట : సమాజాభివృద్ధిలో విశ్రాంత ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆన్నారు. సూర్యాపేటలోని జీవీవీ ఫంక్షన్ హాల్లో ఆర్టీసి ఉద్యోగి, టీఎంయూ సీనియర్ నాయకుడు బెల్లి నరసయ్య పదవీ విరమణ మహోత్సవం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి నరసయ్య చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. 36 ఏళ్ల పాటు ఆర్టీసీకి సేవలందించి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
విరామం తర్వాత కుటుంబానికి సమయం కేటాయించడంతోపాటు సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి విశ్రాంత ఉద్యోగులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి తనతో కలిసి నడవాలని మంత్రి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జ్యోతి కరుణాకర్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.