సూర్యాపేట : మాతృ భాష పరిరక్షణకు పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మ మీద ఉన్నంత ప్రేమ మాతృభాష మీద ఉండాలని ఆయన కోరారు. సృష్టిలో ప్రాణి జీవనానినికి అమ్మ ఎంతటి అవసరమో, అదే ప్రాణి జీవితంలో మనుగడ సాధించడానికి భాష అంతటి అవసరంగా గుర్తించ గలిగిన రోజునే మాతృభాష కాపడబడుతుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో భాష దూరభిమానం ఎంతమాత్రం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు.
జిల్లాలోని కోదాడ నియోజకవర్గ పరిధి నడిగూడెం ఘడిలో జరిగిన దివంగత కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు శత వర్ధంతి వేడుకల్లో ఆయన సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాన్ని విలువలను ప్రతిబింబింప చేసేదే మాతృభాష అని ఆయన అభివర్ణించారు. అలాంటి మాతృభాషపై మమకారం పెంపొందించుకోవడంతో పాటు పట్టు సాధించే దిశగా నిరంతర ప్రయత్నం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
అదే సమయంలో మాతృభాష దూరభిమానం కాకూడదనిచెప్పారు. రోజు రోజుకు పరాయి బాష మీద పెరుగుతున్న మోజును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన సుస్పష్టంగా వెల్లడించారు. అయితే అవసరం కోసం పరాయి భాషను నేర్చుకోవడాన్ని తప్పు పట్టడం లేదన్నారు.
ఎలాంటి పరిస్థితులలో ఉత్పత్తుల భాషను ఇతర భాషల్లోకి తర్జుమా చేయలేమన్న వాస్తవాన్ని గుర్తించగలిగితే మాతృభాషకు ఉన్న ప్రాముఖ్యత ఇట్టే తెలిసి పోతుందన్నారు.అలాంటి ప్రయత్నం 100 ఏండ్ల కిందటే కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు లాంటి ఉద్దండులు మొదలు పెట్టారని, మాతృభాష పటిష్ఠతకు పునాదులు వేసిన దివంగత కొమర్రాజు లక్ష్మణ్ రావు తెలుగు భాషా వైతాళికుడు అని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, జస్టిస్ రామలింగేశ్వర రావు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, ఐ ఏఎస్ అధికారి ముక్తేశ్వర్ రావు, తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య గౌరవ ఉపాధ్యక్షుడు సామల రమేష్ బాబు, ఆంధ్రపత్రిక సంపాదకులు మా శర్మ, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, చరిత్ర పరిశోధకుడు జితేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.