Minister Jagadish Reddy | సూర్యాపేట నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దంపతులు హాజరయ్యారు. యంత్ర ప్రతిష్ట, దేవి విగ్రహ, శిఖరం, బలిపీఠ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాలతో నెమ్మికల్ పరిసరాలు ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ శిఖరానికి పూజలు చేసేందుకు ఏర్పాటు చేసిన క్రేన్ మొరాయించడంతో సెంట్రింగ్ కర్రల సహాయంపై మంత్రి దంపతులు పైకి చేరుకొని కుంభాభిషేకం నిర్వహించారు. ఐదు గంటల పాటు ఆలయ విగ్రహప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొన్న అనంతరం అమ్మవారికి తొలిపూజలు చేసిన మంత్రి దంపతులు హారతిని స్వీకరించారు.
పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారి వెంట వెళ్లే వాహనదారులను అనునిత్యం ప్రమాదాల బారిన పడకుండా చల్లనిచూపులతో దండు మైసమ్మ కాపాడుతున్నదని, ప్రతీ ఒక్కరికీ అమ్మవారి కటాక్షం కలగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ దంపతులు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.