బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 28 : ‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో మేరు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన టైలర్స్ డే కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నదని అన్నారు. మన లాంటి దేశాల్లో కార్పొరేట్లు అవసరం లేదని, జనం లేని దేశాల్లో పెట్టాల్సినవి మన దగ్గర పెట్టి కొద్ది మంది కోటీశ్వరులు కావడానికి లక్షల మందిని ఆకలితో చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెడీమేడ్ రంగం రాజ్యమేలుతుందని, దీంతో ఇప్పటికే ఎంతో మంది చేనేత కార్మికుల ఆకలి చావులు చూశామని చెప్పారు. ప్రస్తుతం కటింగ్ షాపులు కూడా రిలయన్స్ పెడుతున్నదని పేర్కొన్నారు. ప్రజలకు పని లేకుండా చేసి, పని కోసం ఎదురు చూసేలా చేసి తక్కువ జీతానికి పని చేసేలా ఇలాంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో టైలర్లకు 160 కుట్టు మిషన్లు ఇచ్చామని, పది రోజుల్లో మరో 220 మిషన్లు ఇస్తామని చెప్పారు. మేరు సంఘం భవన నిర్మాణం కోసం స్థలాన్ని చూశామని, త్వరలోనే శంకుస్థాపన చేసుకొని దసరా నాటికి ప్రారంభించుకొని వచ్చే సమావేశాన్ని అందులోనే పెట్టుకుందామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మేరు సంఘం నాయకులు బోడపల్లి మాధవ్, గట్ల చరణ్, దూలం నగేశ్, శ్రీనివాస్, పాండురంగాచారి, నరేందర్, దీకొండ శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.