యాదగిరి గుట్ట, భువనగిరి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దురాగతాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. యాదగిరిగుట్ట రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ( BRS )పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఢిల్లీ లో అసలు లిక్కర్ స్కాం ఏమి లేదని, ఆ రాష్టం తీసుకున్న పాలసీ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయం చేస్తూ ఐటీ, సీఐడీ( IT and CID) లను పంపినా ఏమి చేయలేక ఈడీని ముందు పెట్టి ఆడిస్తుందని విమర్శించారు. లిక్కర్ స్కాం లో ఎలాంటి ఆధారాలు లేకున్నా బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈడీ విచారణ చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రధాని అయ్యాక దేశంలో ఆకలి చావులు పెరిగాయని ఆరోపించారు. ప్రధాని మోడీ దేశాన్ని దోచి, ఆదానీ, అంబానీ లకు అప్పనంగా దోచి పెడుతుందని విమర్శించారు.ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లో లేడని అన్నారు.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆశిస్సులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మరింత అభివృద్ధి చెందాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. శ్రీశోభకృత్ నామ సంవత్సర (ఉగాది) సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.