సూర్యాపేట : ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ వద్ద నూతన ఆలయంలో కొలువుదీరిన దండు మైసమ్మ తల్లికి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు.
కాగా, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.