సూర్యాపేట : సఫాయి కార్మికులు అందిస్తున్న సేవల వల్ల సూర్యాపేట పట్టణానికి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలో శుక్రవారం రాష్ట్రవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా పట్టణ ప్రగతి(Pattana Pragathi) సంబురాలను నూతనంగా ప్రారంభించిన మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. వారి సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డు(Awards)లను అందుకుందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న అధికారులను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను అభినందించారు.
పట్టణాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా, కోర్టుల ద్వారా అడ్డుకున్న శక్తులే ప్రభుత్వంపై అపనిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. తొమ్మిది ఏళ్ళల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కాలేశ్వరం నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు 380 కిలో మీటర్ల దూరం నుంచి పారుతున్న సాగు నీరుతో జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా ప్రతిపక్షాలకు బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట్ కిశోర్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.