సూర్యాపేట : గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో సూర్యాపేట అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడంతో పాటు శారీరకంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని దూరజ్పల్లి వద్ద ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్పై యువతకు క్రేజ్ పెరుగుతుందని, అందుకు తగిన రీతిలో ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ఎంచుకున్న క్రీడలోనే తర్ఫీదు ఉండాలని, తద్వారా గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన స్టేడియంలో150 మంది క్రికెటర్లు ఏక కాలంలో బస చేయడంతో పాటు ప్రాక్టీస్ చేసుకునేలా నిర్మాణం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.