Minister Jagadish Reddy | నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై( Governor Tamilisai ) వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. తెలంగాణ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా, పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ బిల్లలు ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుందని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్ తెలంగాణ బిల్లులపై సంతకం పెట్టలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గవర్నర్ తమిళిసై కుట్రలు చేస్తుందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ సుదీర్ఘ కాలంగా పెండింగ్లో పెట్టడాన్ని సవాల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజ్భవన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా ఈ పిటిషన్ వేశారు. పిటిషన్లో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్కు పంపితే గత ఐదు నెలలుగా ఏడు బిల్లులు, గత నెల రోజుల నుంచి మూడు కలిపి మొత్తం పది బిల్లులకు రాజ్భవన్ ఆమోదం తెలుపలేదని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్భవన్ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్లో తెలిపారు.