హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోదీ ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మాట తప్పిన కేంద్రంపై నిరసనగా ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దని ఉద్యోగార్థులకు సూచించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకూడదనే కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు.
కేసును సీబీఐ చేతికిస్తే రాష్ట్రంలో శాశ్వతంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండాస్వార్థపూరిత రాజకీయం చెలాయించాలనే దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో సాక్షులను చంపిన నీచులు బీజేపీ నేతలని ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై ప్రేమతో బండి సంజయ్ దీక్ష చేయడంలేదని, రాజకీయ ఉద్యోగాల కోసమే దొంగ దీక్ష చేస్తున్నాడని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని మోదీ ముందుగా తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. నవరత్న సంస్థల (ప్రభుత్వరంగ సంస్థలు)ను తన దోస్తులకు కట్టబెడుతున్నందుకు మోదీ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
ఉద్యోగార్థులకు న్యాయం చేసేందుకే సిట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని గుర్తించిందే రాష్ట్ర ప్రభుత్వమే అని, కష్టపడి, పట్టుదలతో చదువుకున్నవాళ్లకు న్యాయం చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం లీకేజీ వ్యవహారంపై సిట్ వేసిందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. పేపర్ లీకేజీ జరిగిందని రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నేత చెప్పలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమగ్ర విచారణ కోసం సిట్ వేశామని చెప్పారు. దర్యాప్తులో దోషులని తేలితే ఎంతటివారైనా సరే ప్రభుత్వం విడిచిపెట్టబోదని తెలిపారు. ప్రపంచంలో దేశ ఇమేజ్ను కాపాడుతూ.. రాష్ర్టానికి వేల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని చెప్పారు. పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. యువతను ఆందోళన పథంవైపు నడిపిస్తున్న క్రమంలో భాగంగా ఓయూలో జరిగిన ఘటన వెనుక ఉన్న దొంగలను గుర్తిస్తామని చెప్పారు.
దేశ ప్రజలకోసం గళమెత్తే నేత కేసీఆర్
దేశ ప్రజల యోగక్షేమాల కోసం గళమెత్తి, వారి హక్కుల పరిరక్షణకోసం పోరాడే నాయకుడు సీఎ కేసీఆర్ అని, ఆ ప్రజల్లో రాహుల్గాంధీ కూడా ఉన్నారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాహుల్గాంధీపై అనర్హతవేటు మోదీ దుర్మార్గ, అప్రజాస్వామిక పాలనకు పరకాష్ఠ అని అన్నారు. కేంద్రప్రభుత్వ ఏజెన్సీలనే కాకుండా చివరికి పార్లమెంట్ సచివాలయాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర మోదీ సర్కారుకే దక్కతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సుప్తచేతనాస్థితికి చేరిపోయిందని, రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తే పోరాడలేని దైన్యస్థితిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.