హైదరాబాద్: సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
విద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన పోరాడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఈ భయంతోనే వివాదాస్పద చట్టాలను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారని తాము భావిస్తున్నామన్నారు.
రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకుండానే ఇన్ని రోజులు సాగాయని, కేసీఆర్ చేపట్టిన మహాధర్నా.. రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోదీ నమ్మారని తెలిపారు. ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతుందనే భయంతోనే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన టీఆరెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.